సీఎం కిరణ్ కుమార్ భారీ వ్యూహానికే స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికీ ఆట ముగియలేదని, ఇంకా చాలా బంతులు మిగిలే ఉన్నాయని తాజాగా ప్రకటించిన కిరణ్ ఓ సంచలన చర్యకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ లో ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని తన వ్యూహానికి ఢిల్లీనే వేదికగా ఎంచుకున్నారు.
ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలోని రాంలీలా లేదా జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలనే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తన ఆట కోసం లక్షమంది జనాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, అనంతపురం నుంచి సమైక్యవాదులను ధర్నాకు తరలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
తన ధర్నాతో ఢిల్లీలో రచ్చ రచ్చ చేసి అక్కడే తన పదవికి, పార్టీకి రాజీనామాను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.
కిరణ్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనను ఆపేందుకే తను విధుల్లో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. తాను సిఎం పదవికి రాజీనామా చేయడమనేదీ ఓ ఆప్షన్ లాంటిదన్నారు. నిన్న (గురువారం) రాత్రి సీఎం కిరణ్ తో మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు కృష్ణరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం సీఎం రాజీనామాపై పట్టుదలగా ఉన్నారని కాసు, ఏరాసు తెలిపారు. ఈ నెల 16న సీమాంధ్ర ఎంపీలతో సీఎం భేటీ అవుతారని.. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారని తెలిపారు.
మొత్తానికి సీమాంధ్ర నేతలతో సమావేశం అవుతూ.. కిరణ్ తన అస్ర్తాలను(బంతులను) సిద్ధం చేసుకుంటున్నారు.
No comments:
Post a Comment